Updated 2 February 2022 Wednesday 12:20 PM
చిత్తూరు (రెడ్ బీ న్యూస్): చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడుతున్న కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ఎర్ర చందనం దుంగలతో అతివేగంగా ప్రయాణిస్తున్న తమిళనాడు రిజిష్ట్రేషన్ కలిగిన కారు ఈరోజు తెల్లవారుఝామున 5గంటల సమయంలో చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం, పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి కన్నలి గ్రామం ఎస్టీ కాలనీ వద్ద అదుపుతప్పి ఒక ఇంట్లోకి దూసుకువెళ్లింది. దీంతో ఆ ఇల్లు ధ్వంసం అయ్యింది.
ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా కొట్టిందని తెలుస్తోంది. ఈఘటనతో ఎర్ర చందనం తరలిస్తున్న స్మగ్లర్లు కారు వదిలి పెట్టి పరారయ్యారు. ధ్వంసం అయిన ఇంటిలో నివసిస్తున్న భర్త భాస్కరయ్య (62) రత్నమ్మ (49) లకు తీవ్ర గాయాలయ్యాయి.
స్ధానికులు వారిని శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు, అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారునుంచి 8 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.







