UPDATED 28 JANUARY 2022 FRIDAY 12:00 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): ఆంధ్రప్రదేశ్ లో మరో 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అర్ధరాత్రి వేళ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాజకీయ రగడ రాజుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ, ప్రాంతీయతను పరిగణలోకి తీసుకోకుండా జిల్లాలను ఎలా ఏర్పాటు చేస్తారంటూ.. ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక జిల్లాల సరిహద్దులు, రెవెన్యూ డివిజన్ల కేటాయింపులే తరువాయి భాగం.. అన్న సూచనతో వైసీపీ ప్రభుత్వం ముందుకు పోతున్న సమయంలో.. జిల్లాల ఏర్పాటుపై సందిగ్థత ఏర్పడింది.
కోవిడ్ పరిస్థితుల కారణంగా జూన్ 30 వరకు జనగణన జరిపే పరిస్థితి లేదని అప్పటి వరకు జిల్లాల సరిహద్దులు మార్చవద్దని డిసెంబర్ 23న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు జనగణన డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా మూడో దశ, వ్యాక్సినేషన్ పంపిణీ కొనసాగుతుండడం వలన జనగణనలో జాప్యం జరుగుతుందని జనగణనశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
దీంతో ఉగాది నాటికి జిల్లాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పరిపాలన సాగించాలన్న వైసీపీ ప్రభుత్వ కలలకు బ్రేక్ పడింది.ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన సహా జిల్లాల సరిహద్దులు మారిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కేంద్రం జనగణన డైరెక్టర్ పేర్కొన్నారు. ఇక ఏపీలో జిల్లాల ఏర్పాటుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ పై స్పందించాల్సి ఉందని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.







