UPDATED 12TH MAY 2017 FRIDAY 3:00 PM
19 నెలల శ్రీజయ్కు అరుదైన కాలేయ వ్యాధి
-కాలేయ మార్పిడి అత్యవసరమన్న వైద్యులు
-ఆర్థిక సాయం కోరుతున్న చిన్నారి తల్లిదండ్రులు
హైదరాబాద్: ఈ చిత్రంలో కనిపిస్తున్న 19 నెలల చిన్నారి శ్రీజయ్. గ్లెకోజెన్ స్టోరేజ్ డిజార్డర్ అనే అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. నాలుగు నెలల వయసులో ఈ వ్యాధిని వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి ఎనిమిది పర్యాయాలు ఆ చిన్నారిని రెయిన్బో, గ్లోబల్ హాస్పిటల్ తదితర ఆసుపత్రులలో ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి చికిత్స చేశారు. గత వారం కూడా అక్యూట్ మెటాబోలిక్ అసిడోసిస్, అండ్ ది కనెక్టెడ్ ఎయిల్మెంట్స్ కారణంగా హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం ఈ చిన్నారి ఇంటి వద్ద ఉంటున్నాడు. తమ చిన్నారి బతుకాలంటే కాలేయ మార్పిడి ఒక్కటే మార్గమని వైద్య బృందం తేల్చిందని హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో నివసించే శ్రీజయ్ తల్లిదండ్రులు బాలకొండ జగన్మోహన్, పావని తెలిపారు. అది కూడా సాధ్యమైనంత త్వరగా జరుగాలని సూచించారని పేర్కొన్నారు. శస్త్రచికిత్స ముందు పరీక్షలు, కాలేయ మార్పిడి ఖర్చు, శస్త్ర చికిత్స తర్వాత మందులకు రూ.25 లక్షలకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆ తదుపరి కూడా ఖరీదైన మందులను వాడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏడాదిన్నరగా మాకున్నదంతా బాబును కాపాడుకోవడానికే ఖర్చుపెడుతున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు అని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటీవల నిర్వహించిన రక్తపరీక్షల్లో బాబు ప్రాణాపాయం ముందు నిలిచి ఉన్నాడని, వెంటనే కాలేయ మార్పిడి జరుపాలని చెప్పారని తల్లిదండ్రులు తెలిపారు. ఈ పరిస్థితిలో మా బిడ్డను కాపాడుకునేందుకు మానవతాభావంతో అందరూ సహకరించాలని కోరుతున్నాం. ప్రత్యేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు, ఐటీ మంత్రి కె.తారక రామారావు చొరవ చేసి, బాబు ప్రాణాలను నిలిపేందుకు సహకరించాల్సిందిగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం అని బిడ్డ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. సహాయం చేయాలనుకునే దాతలు 9989060222 నంబరులో సంప్రదించవచ్చు.







