UPDATED 18th MARCH 2022 FRIDAY 07:30 PM
BJP Janasena Government : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీలో నూతనోత్సాహం నింపాయి. ఇప్పుడు ఆ పార్టీ నేతలు మిగతా రాష్ట్రాలపైనా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై మరింత ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం అప్పుడే వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా ఏపీలో ఎన్నికల గురించి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నిన్న యూపీ గెలిచాం, నేడు ఏపీ గెలుస్తాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.2024లో ఏపీలో రాబోయేది బీజేపీ-జనసేనల ప్రభుత్వమేనని జీవీఎల్ నరసింహారావు విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేనతో కలిసి అడుగులు వేస్తూ, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ ప్రథమ లక్ష్యమని అన్నారు. వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ అవతరిస్తుందని చెప్పారు. (BJP Janasena Government) బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలందరూ సమావేశమై బలమైన రాజకీయ వ్యూహాలను తయారు చేస్తామని తెలిపారు.
విజయవాడలోని తన నివాసం దగ్గర నిర్వహించిన హోలీ వేడుకల్లో జీవీఎల్ పాల్గొన్నారు. రాయలసీమ సమస్యలకు సంబంధించి కడపలో శనివారం రణభేరిని నిర్వహించనున్నట్టు జీవీఎల్ తెలిపారు.జీవీఎల్ ఇంట్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. కుటుంబసభ్యులు, బీజేపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆయన వేడుకల్లో పాల్గొన్నారు. నాలుగు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరవేయడంతో ఈ హోలీ తమకు ఎంతో స్పెషల్ అని జీవీఎల్ అన్నారు.
ఇదే ఉత్సాహంతో పని చేసి 2024లో తెలుగు రాష్ట్రాల్లోనూ పాగా వేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి అసహనం ఎక్కువ అవుతోందన్న జీవీఎల్.. దాన్ని తగ్గించుకోకపోతే తొందరలోనే గద్దె దిగడం ఖాయమని హెచ్చరించారు జీవీఎల్.
వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం తీవ్రం చేస్తామని జీవీఎల్ తెలిపారు. ఈ సందర్భంగా జీవీఎల్ ఇంటి దగ్గర.. నిన్న యూపీ, నేడు ఏపీ అనే నినాదాలు జోరుగా వినిపించాయి. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తోందని జీవీఎల్ మండిపడ్డారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని రేపటి కడప సభలో వివరిస్తామన్నారాయన. ప్రధాని మోదీ పాలన చూసి అంతా భేష్ అంటున్నారని జీవీఎల్ అన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అందుకోసం నియోజకవర్గాల వారీగా భారీ సభలు నిర్వహించి వైసీపీ ప్రభుత్వం పాలనను ప్రజల దగ్గర ఎండగడతామని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రాజెక్టుల గేట్లు మెయింటైన్ చేయడానికి నిధులు, సిబ్బందిని కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాయలసీమ నుంచి ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చినా.. సాగు విస్తీర్ణం 19 లక్షల ఎకరాలు దాటలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాయలసీమలో సాగు నీటి ప్రాజెక్టులు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. మొత్తంగా ఏపీలో అధికారమే లక్ష్యంగా కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు.







