బెంగళూరు (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం ఆలయాలు రాష్ట్రాల్లోని దేవాదాయశాఖ పరిధిలోకి వస్తాయి. అయితే, తమ అధీనం నుంచి ఆలయాలకు విముక్తి కలిగించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేస్తూ కొత్త చట్టం తీసుకురానున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. ‘‘ఇతర మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు వేర్వేరు చట్టాల పరిధిలో సురక్షితంగా ఉన్నాయి. కానీ, హిందూ ఆలయాలు ప్రభుత్వ నియంత్రణతో, ఆంక్షల చట్రంలో చిక్కుకున్నాయి. ఈ విషయాన్ని కొందరు పెద్దలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆలయ నిర్వహణ విషయంలో స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. అందుకే, ప్రభుత్వ చట్టాల నుంచి ఆలయాలను విముక్తి కలిగేలా కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నాం. బడ్జెట్ సమావేశాలకు ముందే మా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువస్తుంది. ఆలయాలను ఆలయ బోర్డులు స్వతంత్రంగా నిర్వహించుకోగలవని విశ్వసిస్తున్నా’’ అని సీఎం బొమ్మై తెలిపారు. ఇప్పటికే కర్ణాటక సర్కార్.. మతమార్పిడిని అడ్డుకునేందుకు ‘కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్లు, 2021’ను ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనికి ఇటీవల శాసనసభ్యులు ఆమోదం తెలిపారు. శాసన మండలి ఆమోదం కూడా లభిస్తే.. త్వరలోనే ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశముంది.







