UPDATED 8th SEPTEMBER 2022 THURSDAY 03:30 PM
Heavy rains in Andhra Pradesh: పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇది రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల వెంబడి బలపడనుందని వివరించారు.
దీని ప్రభావంతో శనివారం వరకు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దని సూచించారు.
కాగా, రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఇవాళ వర్షాలు కురుస్తున్నాయి.







