UPDATED 3 FEBRUARY 2022 THURSDAY 06:00 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. అదే సమయంలో కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య భారీగా పెరగడం బిగ్ రిలీఫ్ ఇస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 4వేల 605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,93,171కి చేరింది.
ఒక్క రోజులో 11వేల 729 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీల సంఖ్య 21,85,042 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 93వేల 488 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 30 వేల 578 కరోనా టెస్టులు చేశారు. నేటి వరకు రాష్ట్రంలో 3,25,71,365 కోవిడ్ టెస్టులు చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ను విడుదల చేసింది.
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గినా.. ఒక్క రోజు వ్యవధిలో కరోనాతో మరో 10మంది చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 641కి పెరిగింది. బుధవారం 5వేల 983 కరోనా కేసులు నమోదవగా.. శుక్రవారం ఆ సంఖ్య భారీగా తగ్గింది.
మరోవైపు దేశంలో కొత్తగా 1,72,433 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొన్న నమోదైన కేసుల కంటే నిన్న నమోదైన కేసులు 6.8 శాతం అధికంగా ఉన్నాయి. నిన్న కరోనా నుంచి 2,59,107 మంది కోలుకున్నారు.
కరోనా వల్ల మరో 1,008 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 15,33,921 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 4,98,983గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.99 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 167.87 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశారు.







