ఎర్నాకుళం (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: మెట్లు ఎక్కాలంటే మనలో చాలామంది అమ్మో అంటారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు వెదుకుతారు. కేరళలోని ఎర్నాకుళం ఎంజీ రోడ్ మెట్రోస్టేషనులో మాత్రం.. మళ్లీ మళ్లీ మెట్లే ఎక్కుతామంటున్నారు ప్రయాణికులు. కారణం.. ఆ మెట్ల నుంచి వినిపిస్తున్న శ్రావ్యమైన సంగీతమే. ప్రజలను ఆరోగ్యకరమైన అలవాట్ల దిశగా నడిపించేందుకు కేరళలోని కొచ్చి మెట్రోరైల్ లిమిటెడ్ (కేఎంఆర్ఎల్) అధికారులు వినూత్నంగా ఆలోచించి మెట్రోస్టేషనులో మ్యూజికల్ స్టెయిర్కేసు ఏర్పాటు చేశారు. ఈ మెట్లపై అడుగు పెడితే చాలు.. అందంగా లైట్లు వెలుగుతాయి. పియానో, కీబోర్డు నుంచి వచ్చే సంగీత ధ్వనులూ వినిపిస్తాయి. దీనివల్ల తాము ఒత్తిడిని మర్చిపోతున్నామని జనం చెబుతున్నారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఈ సానుకూల స్పందనతో తాము ఇతర స్టేషన్లలోనూ ఈ తరహా మెట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ట్రయాక్సియా మేనేజింగ్ డైరెక్టరు సనోజ్ సిమోన్ తెలిపారు.







