UPDATED 8TH MAY 2017 MONDAY 5:00 PM
పెద్దాపురం: హౌసింగ్ ఫర్ ఆల్ పధకం కింద పెద్దాపురం పట్టణానికి 1724 ఇళ్ళు మంజూరైనట్లు మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సోమవారం మాట్లాడారు. ఈ పధకం కింద జి ప్లస్ త్రీ అపార్ట్ మెంట్స్ 1724 మంజూరయ్యాయని, నాలుగు నెలల క్రితం ఈ పథకానికి సంబంధించి ప్రకటన ఇవ్వడం ద్వారా 4500 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించగా 2400 దరఖాస్తులు అర్హతగా గుర్తించబడ్డాయన్నారు. అలాగే వీటిని మూడు కేటగిరిలుగా విభజించడం జరిగిందని, సింగల్ బెడ్ రూమ్ కింద ౩౦౦ చదరపు అడుగులకు యూనిట్ కాస్ట్ 6 .19 లక్షలు, రెండో కేటగిరి కింద ఒక బెడ్ రూమ్ సైజు 365 చదరపు అడుగులకి యూనిట్ కాస్ట్ 7 .34 లక్షలు, మూడో కేటగిరి కింద రెండు బెడ్ రూములు సైజు 435 చదరపు అడుగులకు యూనిట్ కాస్ట్ 8.47 లక్షలు అని చైర్మన్ పేర్కొన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడి సైతం అందించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ పధకానికి సంబంధించి దళారులను, మధ్యవర్తులను నమ్మవద్దని, అలాగే ఎవరికి సొమ్ములు చెల్లించవద్దని ఈ పథకానికి సంబందించి నేరుగా మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. వచ్చేనెల ఈ పధకాన్ని ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, కమీషనర్ ఏ.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.







