Updated 26 January 2022 Wednesday 06:00 PM
చెన్నై (రెడ్ బీ న్యూస్): ప్రముఖ వ్యాపారవేత్తలు, భారత్ బయో టెక్ ఎండీ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా దంపతులు ప్రతిష్టాత్మక పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డుకు ఎంపికఅవడంపట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వీరు పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ హర్షం వ్యక్తం చేశారు. వీరితో పాటుగా ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన ప్రముఖ తెలంగాణ కళాకారులు దర్శనం మొగులయ్య ( కిన్నెరమెట్ల మొగిలయ్య), రామచంద్రయ్య, శ్రీమతి పద్మజా రెడ్డిలను గవర్నర్ తమిళిసై అభినందించారు. దేశంలో వివిధ రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచి, సామజిక సేవకు కృషిచేసిన సాధారణ పౌరులకు ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలను అందిస్తుంది.
భారతదేశ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలకు వీరు ఎంపికకావడం తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు గర్వకారణమని గవర్నర్ డాక్టర్ తమిళిసై వ్యాఖ్యానించారు. ఎంతో కాలంగా నిబద్ధతతో, అంకితభావంతో తమ తమ రంగాలలో కృషి చేస్తూ సేవలందిస్తున్న వారికి ఈ అవార్డులు దక్కడం అభినందనీయమని గవర్నర్ అన్నారు. తెలంగాణ నుండి అయిదుగురు ప్రముఖులను ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులకు ఎంపిక చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై కృతజ్ఞతలు తెలిపారు.







