అమరావతి (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా వాసి లాన్స్నాయక్ సాయితేజ్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.50లక్షల సాయం అందించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్ ద్వారా ప్రకటించింది. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్కు సాయితేజ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశారు. ఈ క్రమంలో సీడీఎస్ దంపతులు, సాయితేజ సహా మరో 11 మంది హెలికాప్టర్లో వెళ్తుండగా ఘోర దుర్ఘటన జరిగింది. మరోవైపు సాయితేజ్ మృతదేహం గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. దిల్లీ నుంచి ఆయన పార్థివదేహాన్ని స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని ఎగువరేగడకు తరలించనున్నారు. అనంతరం అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.







