UPDATED 8th JULY 2022 FRIDAY 09:15 AM
Subba reddy: వైసీపీ నాయకురాలు విజయమ్మ రాజీనామా చేస్తున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విజయమ్మ రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోన్న వేళ ఆయన ఇవాళ 10 టీవీతో మాట్లాడుతూ.. విజయమ్మ రాజీనామా అంశం ఇప్పటి వరకూ ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. వైసీపీ నిర్వహిస్తోన్న ప్లీనరీకి విజయమ్మ హాజరవుతారని ఆయన తెలిపారు.
పార్టీ నియమావళిలో కీలక మార్పులు చేయబోతున్నామని చెప్పారు. 12 ఏళ్ళ నుంచి ఎలాంటి మార్పులూ జరగలేదని వివరించారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ప్లీనరీ ఉంటుందని ఆయన చెప్పారు. కాగా, వైసీపీ ప్లీనరీ రెండవ రోజు (రేపు) విజయమ్మ ప్రసంగించనున్నారు. రేపు ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు ఆమె ప్రసంగిస్తారని వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆ పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు.







