Updated 27th December 2022 Tuesday 8:25 am
Koil Alwar Thirumanjanam : తిరుమలలో శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టనున్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సాధరాణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా ఉంది.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఆలయ శుద్ధి కార్యక్రమం 10 గంటల వరకు అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి వంటి వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు.
ఈ సమయంలో శ్రీవారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచుతారు. శుద్ధి అనంతరం
నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కలిచిగడ్డ వంటి సుగుంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు.







