UPDATED 4th NOVEMBER 2022 FRIDAY 08:10 PM
TTD : లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పవిత్రమైన కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన కార్యక్రమాల్లో మొదటగా విష్ణుసాలగ్రామ పూజ శుక్రవారం తిరుమల వసంత మండపంలో ఆగమోక్తంగా జరిగింది. మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, సాలగ్రామాలను వసంత మండపానికి వేంచేపు చేశారు.
టిటిడి వైఖానస ఆగమ సలహాదారు ఎన్వి. మోహనరంగాచార్యులు మాట్లాడుతూ ఈ పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలను తెలియజేశారు. 100 అశ్వమేథ యాగాల ఫలితం లభిస్తుందని, జన్మరాహిత్యం కలిగి మోక్షం సిద్ధిస్తుందని చెప్పారు. ముందుగా సంకల్పం, ప్రార్థనా సూక్తంతో విష్ణు సాలగ్రామ పూజను ప్రారంభించారు. అనంతరం వేదపండితులు వేదమంత్రాలు పఠిస్తుండగా అర్చకులు సాలగ్రామాలకు పాలు, పెరుగు, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి పఠించారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, సాలగ్రామాలకు హారతులు సమర్పించారు. నైవేద్యం సమర్పించిన అనంతరం క్షమా మంత్రం, మంగళహారతితో ఈ పూజ ముగిసింది. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ధర్మగిరి వేద పాఠశాల, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు పాల్గొన్నారు.







