ఆవులను పూజించిన వైఎస్ భారతి
తర్వాత సందర్శించిన జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: సీఎం నివాసం ముందు గోశాల ప్రారంభం ఆవులను పూజించిన వైఎస్ భారతి తర్వాత సందర్శించిన జగన్ సీఎం నివాసం ముందు గోశాల ప్రారంభం ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం ముందు పార్కింగ్ స్థలంలో నిర్మించిన గోశాలను సోమవారం ప్రారంభించారు. కార్తిక సోమవారం మంచి రోజు కావడంతో ఆరోజు దీన్ని ప్రారంభించినట్లు సమాచారం కపిల, గిరి, సాయివాల వంటి ఆరు దేశీ ఆవులను ఇందులో ఉంచనున్నారు. ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగే చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి సోమవారం ఆవులను తీసుకువచ్చారు. ఆ ఆవులను ముఖ్యమంత్రి భార్య వైఎస్ భారతి పూజించి గోశాలలోకి తోడ్కొని వెళ్లినట్లు తెలిసింది. భారతి మార్గదర్శకంలో సుమారు ఏడు నెలల నుంచి ఈ గోశాల నిర్మాణ పనులు జరిగినట్లు సమాచారం. ఎమ్మెల్యే చెవిరెడ్డి పర్యవేక్షణలో పనులను పూర్తి చేశారు. ముఖ్యమంత్రి ఇంటిలో నుంచి ఈ గోశాలలోకి ప్రవేశ మార్గాన్ని ఏర్పాటు చేశారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా నిర్మించిన గోశాలలో గోవులు దిగేందుకు వీలుగా ఒక కొలను ఏర్పాటు చేశారు. ఆ కొలనుపై చిన్న నడక వంతెనను కూడా నిర్మించారు. చుట్టూ నడక దారిని ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ గోశాలను సందర్శించారు.







