UPDATED 25th AUGUST 2022 THURSDAY 05:20 PM
CM Jagan On AP Debts : గతంలో టీడీపీ ప్రభుత్వం తన వాళ్ల కోసం మాత్రమే పని చేసిందన్నారు సీఎం జగన్. దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా పరిపాలన సాగిందన్నారు. గతంలో చేసిన అప్పులకంటే ఇప్పుడు చేసిన అప్పులే తక్కువ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. మంచి పనులు చేస్తుంటే కుట్రదారులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.కృష్ణా పెడన నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటించారు. చేనేత కార్మికులకు నాలుగో విడత నిధులు పంపిణీ చేశారు. పాదయాత్రలో నేతన్నల కష్టాలను చూశానని జగన్ చెప్పారు. నేతన్న నేస్తం పథకం ద్వారా సొంత మగ్గం ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటున్నామని జగన్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నేతన్నల ఆదాయం పెరిగిందన్నారు. సభా వేదికగా పెడన నియోజకవర్గ అభివృద్ది కోసం రూ.102 కోట్ల నిధుల విడుదలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కృష్ణా జిల్లా పెడనలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద నేతన్నల ఖాతాల్లో నిధులు జమ చేశారు సీఎం జగన్. ఒక్కొక్కరికి రూ.24 వేల చొప్పున మొత్తం రూ.193.31 కోట్లను విడుదల చేశారు. ఈ పథకం కింద 80,546 నేతన్నలు లబ్ది పొందారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోంది.కాగా, నేతన్న నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీఎం జగన్ స్వయంగా మగ్గం నేయడం విశేషం. ఆయన మగ్గాన్ని, దాని పనితీరును తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. మంత్రులు జోగి రమేశ్, రోజా కూడా ఈ సందర్భంగా సీఎం పక్కనే ఉన్నారు.







