UPDATED 28th JANUARY 2019 MONDAY 9:00 PM
సామర్లకోట: పట్టణ పేదరిక నిర్మూలనకు సెంట్రలైజ్డ్ కాల్ సెంటర్ సేవలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర ఉపముఖమంత్రి, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పట్టణ పేదరిక నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ణణ ప్రాంతాలలో నివసిస్తున్న నిపుణులైన పనివారలకు నిరంతరాయంగా పని కల్పించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్ధేశ్యంతో ఆంధ్రప్రదేశ్ పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో మలిరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో పైలట్ ప్రోజెక్టుగా కాకినాడలో దీనిని ఏర్పాటు చేశారు. హోం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆన్లైన్లో జీవనోపాధుల నమోదు కార్యక్రమానికి ఉద్దేశించిన www.saukaryam.in వెబ్సైట్ను ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాల్ సెంటర్ ఏర్పాటు ద్వారా పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు నిత్యజీవితంలో అవసరమైన గృహ, పారిశ్రామిక అవసరాలకు కావలసిన సేవలను నిపుణులైన పనివారి ద్వారా అందించబడుతుందని, ఈ కాల్ సెంటర్లో నమోదు చేసుకున్న వృత్తి నైపుణ్యతలు కలిగిన నిపుణులైన పనివారలు, సర్వీసు ప్రొవైడర్స్కు ప్రజల, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతాక్రమంలో పని కల్పించబడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంట్రలైజ్డ్ కాల్ సెంటర్ ప్రోజెక్టు కోఆర్డినేటర్ సత్య, సీనియర్ పాత్రికేయుడు తంగిశెట్టి మధుసూధనరావు, మలిరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ఎం.వి.ఆర్.ఫణీంద్ర, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ తూర్పుగోదావరి జిల్లా మిషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, స్వర్ణాంద్ర వ్యవస్థాపకులు పడాల రామారెడ్డి, ఎఫ్.ఎం.రేడియో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈశ్వర ప్రసాద్, ఇంజనీర్ పిట్టా జాన్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.







