UPDATED 17th FEBRUARY 2022 THURSDAY 05:30 PM
విజయవాడ : అభివృద్ధి విషయంలో కేంద్రం ఎవరిపైనా వివక్ష చూపించదని… అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని ఆయన అన్నారు. ఏపీలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఎంతో కీలకమైనవి అన్న ఆయన… వ్యవసాయ రంగంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో పోర్టులది కీలక పాత్ర అని చెప్పారు.
విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ.. 30 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజని అన్నారు. ”ఏపీలో రోడ్ల అభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు కేటాయిస్తాం. ఏపీలో 3 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నాం.
2024లోగా రాయ్పూర్-విశాఖ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అందుబాటులోకి తెస్తాం. నాగ్పూర్-విజయవాడ, బెంగళూరు-చెన్నై మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మిస్తాం. రూ.5వేల కోట్లతో చిత్తూరు-తంజావూర్ ఎక్స్ప్రెస్ హైవేని పూర్తి చేస్తాం’’ అని గడ్కరీ వెల్లడించారు.”రోడ్లు బాగుంటే రవాణ వ్యయం భారీగా తగ్గుతుంది. చైనాతో పోల్చితే భారత్లో రవాణ వ్యయం చాలా ఎక్కువ. త్వరలో డీజిల్ లారీలకు బదులు ఎలక్ట్రిక్ లారీలు, డీజిల్ స్థానంలో సీఎన్జీ, ఎల్పీజీ రవాణ వాహనాలు రానున్నాయి. పోలవరం పూర్తయిన తర్వాత వ్యక్తిగతంగా వస్తా. నేను జలవనరుల మంత్రి కాదు.. అయినా పోలవరం చూస్తా’ అని నితిన్ గడ్కరీ చెప్పారు.







