Updated 10th December 2022 Saturday 8:25 am
Mandous Cyclone: మాండౌస్ తుపాను తీరందాటింది. పుదుచ్చేరి – శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత 1.30గంటలకు తీరం దాటింది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ శనివారం సాయంత్రం నాటికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. తీరంలో కొనసాగుతున్న అలజడితో మరో రెండురోజులు ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీలోని పలు జిల్లాల్లో అతిభారీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
మాండౌస్ తుపాన్ ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో.. శుక్రవారం రాత్రి నుంచి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను తీరం దాటినప్పటికీ రేపటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ అధికారులు వెల్లడించారు.
మాండౌస్ తుపాను తీరందాటే సమయంలో, శనివారం ఉదయం 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుపాను కారణంగా నెల్లూరు జిల్లా నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేటలో భారీ వర్షం కురుస్తుంది. ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలమట్టమయ్యాయి. తిరుమలలోనూ వర్షపడుతుంది. తిరుపతి జిల్లాలో వర్షాల కారణంగా సువర్ణముఖి నదికి వరదనీరు చేరుతుంది. ఏర్పేడు మండలం కొత్తవీరాపురం వద్ద కాజ్వేపై వరద నీరు ప్రవహిస్తుంది. ఏర్పడు – మోదుగులపాలెం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాళహస్తి – పాపానాయుడుపేట- గుడిమల్లం రహదారిపై వరదనీరు ప్రవహిస్తుంది. తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఘాట్ రోడ్డులో వాహనదారులను సిబ్బంది అప్రమత్తం చేశారు. నగరంలోని లక్ష్మీపురం సర్కిల్, రామానుజ సర్కిల్, అన్నమయ్య సర్కిల్, పద్మావతి పురం, లీలమహల్, వెస్ట్ చర్చి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా జలమయం అయ్యాయి.







