అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: పీఆర్సీతో పాటు పెండింగ్లో ఉన్న 70 డిమాండ్లను పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం నుంచి హామీ రావడంతో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించాయి. ఉద్యోగులు లేవనెత్తిన అంశాలపై దశలవారీ పరిష్కారంకోసం లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంతోనే ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాలు ప్రకటించాయి. సజ్జలతో ఉద్యోగ సంఘాల నేతల భేటీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఇవాళ సాయంత్రం ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. పీఆర్సీ, ఇతర డిమాండ్లపై సజ్జల చర్చించారు. సమావేశం ముగిసిన తర్వాత ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎంతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని సజ్జల చెప్పారని తెలిపారు. పీఆర్సీపై సోమవారం నిర్ణయం తీసుకుంటారని, మిగతా 70 డిమాండ్లపైనా చర్చించి బుధవారం నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఉద్యమాన్ని పూర్తిగా విరమించలేదని తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారంపై లిఖిత పూర్వక హామీ ఇచ్చారని వెల్లడించారు. ప్రభుత్వానికి అవకాశం ఇచ్చేందుకే ఉద్యమం తాత్కాలిక వాయిదా వేసినట్టు చెప్పారు. సమస్యల పరిష్కార బాధ్యత సీఎంవో అధికారికి ఇస్తామన్నారని వెల్లడించారు.







