UPDATED 8th APRIL 2022 FRIDAY 08:00 AM
CM Jagan Tour : ఏపీ సీఎం జగన్ శుక్రవారం (ఏప్రిల్ 8) రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల 50 నిమిషాలకి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు జగన్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 11 గంటల 10 నిమిషాలకి నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చేరుకుంటారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులతో భేటీ అవుతారు. ఉదయం 11.35కు బహిరంగ సభ జరిగే ఎస్పీజీ మైదానానికి చేరుకుంటారు. బహిరంగ సభ దగ్గర జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12.40కి తిరుగు పయనమవుతారు జగన్. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ దగ్గర ఉన్న హెలిప్యాడ్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి గన్నవరానికి వెళ్లనున్నారు. సీఎం జగన్ నంద్యాల పర్యటనకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో హెలిప్యాడ్, ఎస్పీజీ గ్రౌండ్లో బహిరంగ సభ వేదిక దగ్గర ఏర్పాట్లను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డి.. జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్, కర్నూలు జిల్లా రేంజ్ డీఐజీ సెంథిల్కుమార్, ఎస్పీ రఘువీరారెడ్డితో కలిసి పరిశీలించారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు : సీఎం జగన్ ఈరోజు ఉదయం నంద్యాల రానున్న నేపథ్యంలో ఓర్వకల్లు ఎయిర్పోర్టులో పటిష్ట బందోబస్తు చేశారు. ఎస్పీ సుధీర్కుమార్రెడ్డి, జేసీ ఎస్.రామసుందర్రెడ్డి, ఎయిర్పోర్టు ఇన్చార్జ్ డైరెక్టర్ మధుసూదన్తో కలసి ఎయిర్పోర్టులో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. సీఎం గన్నవరం నుంచి విమానంలో ఓర్వకల్లు చేరుకొని హెలికాప్టర్ ద్వారా నంద్యాల వెళ్లనున్నారు. తిరిగి నంద్యాల నుంచి హెలికాప్టర్లో ఓర్వకల్లు ఎయిర్పోర్టు చేరుకోనున్నారు. అక్కడి నుంచి విమానంలో గన్నవరం వెళ్లనున్నారు. ఏప్రిల్ 11న ఏపీలో కొత్త కేబినెట్ కొలువుదీరనుంది. ఈ సందర్భంగా కొత్తవారితో పాటు పాత మంత్రులందరూ అందుబాటులో ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. పాత మంత్రుల్లో కొందరికి మళ్లీ మంత్రి పదవులు వరించే అవకాశాలున్నాయి. వారెవరు అన్నది తెలియాల్సి ఉంది. ఈ మధ్యాహ్నం 12:45 గంటలకు నంద్యాల నుంచి సీఎం జగన్ తిరిగి బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 2:25 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.
వసతి దీవెన.. రెండో విడత సాయం : రాష్ట్రవ్యాప్తంగా జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు వైఎస్ జగన్. రెండో విడత సాయాన్ని సీఎం జగన్ ఈరోజు విడుదల చేయనున్నారు. నంద్యాలలో జరిగే బహిరంగ సభలో 10.68 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లను జమ చేస్తారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఆలోచనతోనే భోజన, వసతి ఖర్చులను చెల్లించనున్నారు. ఈ పథకం కింద ఏటా రెండు విడతల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, వైద్య, తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చులకు చెల్లిస్తున్నామని కంపెనీ వెల్లడించింది.







