అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: సినిమా టికెట్ల ధరలకు సంబంధించిన వివాదం సద్దుమణగకముందే ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల విక్రయాలు ప్రభుత్వం ద్వారానే జరిగే విధంగా జీవో నెం. 142 ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం టికెట్ల అమ్మకాలన్నీ ప్రభుత్వ పరిధిలోనే జరుగుతాయి. ఈ బాధ్యతను ఏపీఎఫ్డీసీ (ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్)కి అప్పగించింది. ఐఆర్సీటీసీ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు జీవోలో పేర్కొంది. అతి త్వరలోనే ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇకపై ప్రైవేటు ప్లాట్ఫామ్లపై టికెట్ బుక్ చేసుకునే అవకాశం, థియేటర్లలో టికెట్ కొనుక్కునే సదుపాయం ఉండదని సమాచారం. సినిమా టికెట్ ధరల నిర్ణయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. టికెట్ రేట్లను తగ్గించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 35ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కేవలం పిటిషన్ దాఖలు చేసిన వారికి మాత్రమే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుందని మిగిలిన అన్ని థియేటర్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్లు అమ్మాలని రాష్ట్ర హోంశాఖ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జీవో నెం.142ను తీసుకురావటం విశేషం.







