UPDATED 28th SEPTEMBER 2022 WEDNESDAY 12:30 PM
CM Jagan: బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామిని జగన్ దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం హోదాలో సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఇది నాలుగోసారి. ఆయనకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి, శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు. అనంతరం తిరుమలలో నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి రూ.23 కోట్లు విరాళంగా అందించిన మురళీ కృష్ణను ముఖ్యమంత్రి అభినందించారు.
అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన వీపీఆర్ విశ్రాంతి గృహాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, ఆర్కే రోజా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి ఉన్నారు.







