UPDATED 11th APRIL 2022 MONDAY 06:00 AM
Jagan New Cabinet : మరికొద్ది గంటల్లో ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువు దీరనుంది. ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వెలగపూడి సచివాలయం ఆవరణలో ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన 11 మంది తిరిగి ప్రమాణ స్వీకారం చేయనునున్నారు. మొత్తం 25 మందితో నూతన మంత్రివర్గం కొలువుదీరబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచన మేరకు నూతన మంత్రులకు గవర్నర్ శాఖలు కేటాయించనున్నారు. కొత్త మంత్రుల జాబితా నిన్ననే గవర్నర్కు చేరింది. రాత్రి ఆయన కొత్త కేబినెట్కు ఆమోదం తెలిపారు.
అన్ని అంశాలను బేరీజు వేసుకుని ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల సైన్యాన్ని రెడీ చేసుకున్నారు. కొత్త కేబినెట్లో 11 మంది పాత మంత్రులకు మరోసారి అవకాశం కల్పించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, నారాయణస్వామి, చెల్లుబోయిన వేణుగోపాల్, పినిపె విశ్వరూప్, అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, గుమ్మనూరు జయరాం, సీదిరి అప్పలరాజు, ఆదిమూలపు సురేశ్, తానేటి వనితకు మరోసారి మంత్రులుగా అవకాశం ఇచ్చారు.
మొత్తం 25 మందిలో 70 శాతం బలహీన వర్గాల ప్రాతినిధ్యం ఉండేలా చూసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశారు. జగన్ మంత్రివర్గంలో నలుగురు మహిళలకు చోటు దక్కింది. రోజా, తానేటి వనిత, విడదల రజిని, ఉషాశ్రీ చరణ్ను కేబినెట్లోకి తీసుకున్నారు. అయితే గతంలో లాగా ఈసారి కూడా మహిళకే హోంమంత్రి పదవి ఇస్తారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.







