UPDATED 9th FEBRUARY 2022 Wednesday 07:30 PM
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్): ఆంధ్రప్రదేశ్ లో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయసహకారాలు అందడం లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఏపీలో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టు పనుల్లో పురోగతి ఎందుకు లేదంటూ టీడీపీ ఎంపీ కే.రామ్మోహన్ నాయుడు బుధవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధప్రదేశ్ లోని రైల్వే ప్రాజెక్టుల అమలుకు తన వాటాగా ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని అందుకే ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే నిలిచిపోయాయని ఆయన తెలిపారు.
57.21 కిలోమీటర్ల కోటపల్లి – నర్సాపూర్ కొత్త రైల్వే లైను ప్రాజెక్టు సహా.. అనేక ప్రాజెక్టుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కోటపల్లి – నర్సాపూర్ రైల్వే లైన్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం రూ. 357.96 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం రూ.2.69 కోట్లు మాత్రమే ఏపీ ప్రభుత్వం డిపాజిట్ చేసిందని అశ్విని వైష్ణవ్ వివరించారు. దీనిపై ఏపీ ప్రభుత్వానికి పలుమార్లు సూచనలు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని అన్నారు. నిధులు డిపాజిట్ చేస్తే తక్షణమే ఆయా ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించవచ్చని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.







