UPDATED 27th OCTOBER 2022 THURSDAY 10:30 PM
Chandrababu : 2024 ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో దూకుడు పెంచారు. నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితిపై పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తో కలిసి సమీక్షించారు.
పార్టీ నిర్వహించిన సర్వేలో తేలిన అంశాలపై ఇద్దరూ చర్చించారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓటు బ్యాంకు స్థిరంగా ఉందా లేదా అన్న అంశంపై ఆరా తీశారు. కొంతమంది నేతలు టీడీపీ వీడి వైసీపీలో చేరిన తర్వాత పరిస్థితి ఎలా ఉందన్న అంశంపై చంద్రబాబు, లోకేశ్ చర్చించారు.
వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో గెలిచి చరిత్ర తిరగరాసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో తాడు ఓడిపోయినా, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నానని చంద్రబాబు దృష్టికి తెచ్చారు లోకేశ్. గత ఓటమిని పట్టించుకోకుండా అందరిని సమన్వయం చేసుకుంటూ అత్యధిక మెజారిటీతో గెలవాలని సూచించారు చంద్రబాబు.







