హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: పేదలకు న్యాయం అందడమే అంతిమ లక్ష్యంగా ఉండాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్లోని నల్సార్ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవానికి జస్టిస్ ఎన్వీరమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భాష ఏదైనా సమాచార మార్పిడి సమర్థంగా, ఆకర్షణీయంగా ఉండాలని సూచించారు. హక్కులు, న్యాయం కోసం పోరాడేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ శక్తిని వినియోగించుకునే మార్గమే యువత భవిష్యత్ను నిర్దేశిస్తుందన్నారు. న్యాయ సమానత్వం కోసం న్యాయవాదులు కృషి చేయాలని కోరారు. న్యాయ విద్యార్థులు క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, బర్కత్పురాలో చిన్న భవనంలో ప్రారంభమైన కళాశాల నేడు అత్యున్నత స్థాయికి ఎదిగిందన్నారు. తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్చంద్ర, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తదితరులు స్నాతకోత్సవానికి హాజరయ్యారు.







