UPDATED 15th FEBRUARY 2022 TUESDAY 05:00 PM
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలోని పురాతన కట్టడం ఛార్మినార్ ఆవరణలో జనరేటర్ పెట్టడానికి తవ్వకాలు జరపగా.. అక్కడ మెట్ల మార్గం వెలుగులోకి వచ్చింది. వెంటనే పురావస్తు శాఖ అధికారులు అక్కడకి చేరుకుని మెట్ల మార్గాన్ని పరిశీలించారు. తవ్వకాలలో అండర్ గ్రౌండ్ మెట్లు బయటపడినట్లు పెద్దఎత్తున ప్రచారం జరగడంతో అక్కడకు చేరుకున్నారు స్థానికులు.
అండర్ గ్రౌంట్ మెట్లు పరిశీలనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఎంఐఎం పార్టీ నేతలు ఆందోళనకు దిగడంతో తవ్వకాలు ఆపేశారు అధికారులు. పురావస్తు శాఖ ఉన్నతస్థాయి అధికారులు కూడా అక్కడకు వచ్చి పరిశీలిస్తున్నారు. మరోవైపు ఛార్మినార్ అవరణలో తవ్వకాలు జరపడానికి అనుమతి ఎవరిచ్చారు అంటూ ఎంఐఎం నేతలు స్థానిక కార్పొరేటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రస్తుతమైతే తవ్వకాలను ఆపేసిన అధికారులు అక్కడి స్థానికులతో చర్చిస్తున్నారు. తవ్వకాలపై ఎంఐఎం నేతలకి వివరించారు పురావస్తుశాఖ అధికారులు. మీడియాను పంపేసి పురావస్తు శాఖ అధికారులు మాత్రమే అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు.







