UPDATED 5th OCT 2022 WEDNESDAY 01:50 PM
KCR National Party: సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్.. దానిని అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. దీంతో తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను బలోపేతంపై కేసీఆర్ దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేసీఆర్ అండ్ టీం ప్రత్యేక దృష్టిసారించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఏపీలోనూ అభ్యర్థులను నిలబెట్టేలా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసినట్లు టీఆర్ఎస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
సీఎం కేసీఆర్కు ఏపీలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కేసీఆర్ ఏపీలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి జై కేసీఆర్ అంటూ నినాదాలుసైతం చేశారు. దీనికితోడు పలు సందర్భాల్లో కేసీఆర్కు మద్దతుగా ఏపీలో బ్యానర్లుసైతం వెలిశాయి. తాజాగా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటిస్తున్న సందర్భంగా మద్దతు తెలుపుతూ విజయవాడలో ప్లెక్సీలు వెలిశాయి. బండి రమేష్ పేరుతో ఉన్న ఈ ప్లెక్సీల్లో జయహో కేసీఆర్ అంటూ రాసిఉంది. ఏపీలో కేసీఆర్కు వస్తున్న మద్దతును సద్వినియోగంచేసుకునేలా ఏపీలో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసేలా టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఫోకస్ పెట్టారు.
సంక్రాంతి తరువాత విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ఏపీలోనూ బీఆర్ఎస్కు పునాదులు వేసేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది.







