UPDATED 26th MAY 2019 SUNDAY 9:00 PM
సామర్లకోట: జిల్లాలో ఉన్న మున్సిపల్, గ్రామాల పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలపై సర్వే చేసి ఆ సమస్యలను పరిష్కరించేందుకు పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ సహాయ కార్యదర్శి బోడా కొండ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయని ఒక్క అవకాశం ఇచ్చే ఉద్దేశ్యంతో ప్రజలు జగన్ కు పట్టం కట్టారని, నూతన ప్రత్యామ్నాయ మాత్రం ప్రజల్లో చావలేదని అన్నారు. నూతన ప్రత్యామ్నాయం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మనం విఫలమయ్యామని, ముందుగానే ప్రజలను చైతన్యం చేస్తే ప్రజలు ఆదరించేవారని, అయినా ఓట్ల శాతం బాగానే వచ్చిందని అన్నారు. నూతనంగా గెలిచిన ప్రభుత్వం, పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో నూతన ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి సారించాలని అన్నారు. గత నెల రోజులుగా పట్టణాల్లో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని, దీనికి పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే వచ్చే వర్షాలంలో ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక వేసుకుని అధికార యంత్రాంగం పనిచేయాలని ఆయన సూచించారు. అలాగే రాబోయే మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం పార్టీని ప్రజల పార్టీగా తీర్చిదిద్దడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు. పెద్దాపురం పట్టణంలో జూన్ నెల 20, 21 తేదీల్లో జరుగు ఎఐటియుసి జిల్లా రాజకీయ శిక్షణా తరగతులకు పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని, దాన్ని ప్రజా సంఘాలు విజయవంతం చేయడానికి కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి పి. సత్యనారాయణ, సీనియర్ నాయకులు రామదాసు, రమణ, బాపిరాజు, రఘు, తదితరులు పాల్గొన్నారు.







