UPDATED 14th MARCH 2022 MONDAY 06:50 AM
Janasena Avirbhava Sabha : రాజకీయాల్లో అద్భుతాలు చేస్తామంటూ వచ్చిన జనసేన ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. 2022, మార్చి 14వ తేదీ సోమవారం మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఆ పార్టీ.
2024 ఎన్నికలే టార్గెట్గా తాడేపల్లి సభ వేదికగా.. పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేసేందుకు రెడీ అయ్యారు జనసేనాని. ఆవిర్భావ సభతోనే ఎన్నికలకు సమరశంఖం పూరించాలని భావిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ సభకు రావాలని పవన్ కళ్యాణ్ అందరినీ ఆహ్వానించారు.
జనసైనికులు, వీర మహిళలు, రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే అందరూ ఆహ్వానితులేనని జనసేనాని తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పలు మార్గదర్శకాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టర్లను పోస్టులు చేసింది. మొత్తం 13 పాయింట్స్ తో మార్గదర్శకాలు సూచించింది.
1. టోల్ ప్లాజా సిబ్బందితో వివాదం పెట్టుకోవద్దు.
2. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించుకుండా వారికి దారి ఇవ్వాలి.
3. ఎల్లవేళలా క్రమశిక్షణ పాటించి పార్టీ హోదాను నిలబెట్టండి.
4. పోలీసులతో, ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి.
5. అందరినీ గౌరవించండి సహృదయంతో మెలగండి.
6. మద్యం సేవించి వాహనాలు నడపకండి.
7. రోడ్లు మరియు ఇతర ప్రదేశాల్లో అనవసరంగా వాహనాలు ఆపకండి.
8. ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేయకండి. అతి వేగం వద్దు. సాధారణ వేగంతో నడపండి.
9. ద్విచక్రవాహనాల సైలెన్సర్లు తీసి రోడ్లపై నడపకండి. 10. సభాస్థలిలో శాంతంగా ఉండండి. సాధారణ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వండి.
11. అనుక్షణం పార్టీ హోదాను నిలబెట్టండి. వ్యక్తిగత ప్రాధాన్యత కంటే పార్టీ ప్రాధాన్యత ముఖ్యం అని గుర్తు పెట్టుకోండి.
12. చెట్లు, గోడలు, టవర్స్ స్పీకర్ల పైకి ఎక్కకండి.
13. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండండి.
ఇక జనసేన విషయానికి వస్తే…పవన్ ప్రసంగం మీద బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు సైతం ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇటు జనసైనికులు కూడా ఎప్పుడెప్పుడు తమ అధినేత వస్తారో.. ఏం చెప్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు.
భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ స్టైల్లో సాగుతూ.. జన జన జన జనసేనా అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ జనసైనికులను, పవన్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్పై భవిష్యత్తు జెండాని మోయడం కంటే బాధ్యత ఏముంటుంది… ఒకతరం కోసం యుద్ధం చేయడం కంటే సాహసం ఏముంటుంది అంటూ పార్టీ శ్రేణులకు పవన్ సందేశమిచ్చారు.
ఏపీ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని జనసైనికులకు దిశానిర్దేశం చేసేలా ఈ సభ ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. గత రెండున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో.. ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారో ఈ సభ ద్వారా వివరిస్తామని చెప్పారు. మరి పవన్ ఏం చెప్పబోతున్నారనేది కొద్ది గంటల్లో తెలిసిపోనుంది.







