తిరుమల (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: శ్రీవారి దర్శనార్థం అమరావతి రైతులు, మహిళలు తిరుమలకు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. నవంబర్ 1న తుళ్లూరు నుంచి న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో 45 రోజులు చేపట్టిన మహాపాదయాత్ర మంగళవారం తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల చెంత ముగిసింది. ఈ సందర్భంగా రైతులు బుధవారం అలిపిరి మెట్ల మార్గం, బస్సుల్లో తిరుమలకు చేరుకున్నారు. వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సుపధం మార్గం గుండా దర్శనం కల్పిస్తోంది. ఇందుకోసం 850 మంది రైతులకు రూ.300 టికెట్లను జారీ చేసింది. మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు గంటకు 150 మంది రైతులు స్వామివారిని దర్శించుకోనున్నారు.







