రెడ్ బీ న్యూస్ 3 డిసెంబర్ 2021: పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ ట్రైలర్ కోసం యావత్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబరు 6న ఆ సర్ప్రైజ్ను అందించనున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఆ హంగామా ఎలా ఉంటుందో ‘ట్రైలర్ టీజ్’ పేరుతో రుచి చూపించింది. 26 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో.. సినిమాలోని కీలక పాత్రల్ని, థీమ్ని పరిచయం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ దృశ్యాలన్నీ అత్యంత వేగంగా సాగుతాయి. ఈ సినిమాలో ఎవరెవరు ఏ పాత్ర పోషించారో చూడాలనుకుంటే మాత్రం ట్రైలర్ టీజ్ చూసేటప్పుడు యూట్యూబ్ ప్లే సెట్టింగ్స్లో స్పీడ్ను 0.25Xకు తగ్గించుకుంటే ‘పుష్ప’ అసలు ప్రపంచం కనపడుతుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. రష్మిక కథానాయిక. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డిసెంబరు 17న ఈ సినిమా తొలిభాగం విడుదలకానుంది.







