UPDATED 16th JULY 2022 SATURDAY 10:30 AM
CM Jagan: ఆంధ్రప్రదేశ్లో గోదావరి వరదలు, సహాయక చర్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై శనివారం ఉదయం అధికారులతో మాట్లాడారు. గోదవారి వరద ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశానికి సంబంధించిన వివరాల్ని అధికారులు సీఎంకు తెలిపారు.
వరదల వల్ల ఎక్కడా ప్రాణ నష్టం ఉండకూడదని సీఎం జగన్, అధికారులకు సూచించారు. అవసరమైనంత వరకు సహాయక బృందాలను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. మరో 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజల్ని ఆదుకోవడానికి సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి, అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. సేవల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని చెప్పారు. వరద బాధిత కుటుంబాలకు రేషన్ పంపిణీ చేయాలని, యుద్ద ప్రాతిపదికన అన్ని కుటుంబాలకు సాయం అందించాలని ఆదేశించారు.
ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్ నూనె, కేజీ ఉల్లిపాయలు అందించాలన్నారు. ప్రతి కుటుంబానికి రూ.2వేలు, లేదా వ్యక్తికి వెయ్యి రూపాయలు పంపిణీ చేయాలన్నారు. తాను సూచించిన పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి గంటకూ వరద పరిస్థితిపై తనకు సమాచారం అందించాలని ఆదేశించారు.







