Updated 31st December 2022 Saturday 3:40 pm
AndhraPradesh Ministers: మంచివాళ్లయిన వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తామంటే తీసుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై పలువురు వైసీపీ నేతలు స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ఏపీ మంత్రి జోగి రమేశ్ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడికి దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ సవాలును స్వీకరించాలని ఆయన చెప్పారు. ఇటీవల జరిపిన టీడీపీ సభలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, చంద్రబాబును అరెస్టు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. బీసీలు చంద్రబాబు నాయుడి దగ్గరకు ఎందుకు వెళ్లాలని, వారికి ఆయన ఏం చేశారని జోగి రమేశ్ నిలదీశారు.
కొత్త ఏడాది తమ ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకురానుందని అన్నారు. ఏపీ సీఎం జగన్ ప్రతి వర్గ అభివృద్ధిని కోరుకుంటారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందిస్తూ కౌంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడికి పిచ్చి బాగా ముదిరిపోయిందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు భ్రమల్లో బతుకుతున్నారని చెప్పారు. సభలకు డబ్బులు ఇచ్చి జనాలను తెచ్చుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరని విమర్శించారు. ఆయనను చూసి ఎమ్మెల్యేలు ఎవరు టీడీపీలో చేరతారని కౌంటర్ ఇచ్చారు.







