హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: బంజారాహిల్స్ రోడ్ నంబరు 3లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత దాదాపు 1.43 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకొంది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పంజాగుట్ట వైపు నుంచి కేబీఆర్ ఉద్యానవనం వైపు కారు వస్తుంది. ఇదే సమయంలో కేబీఆర్ ఉద్యానవనం వైపు నుంచి పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వైపు ఉద్యోగులతో కూడిన వింగర్ వాహనం వెళుతోంది. గ్లోబల్ హెల్త్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కు చెందిన ఉద్యోగులైన మహ్మద్ ఆరిఫ్, ప్రణతి, దీక్ష, గ్లోరియా, సాయిలక్ష్మి, తేజస్విరెడ్డి, దుర్గారాకేష్లను తీసుకొని వింగర్ డ్రైవర్ పిస్కె గణేష్(34) హైటెక్సిటీ నుంచి మల్కాజిగిరి వైపు వెళుతున్నాడు. సరిగ్గా 1.40 గంటల ప్రాంతంలో కారు ముందు వెళుతున్న ద్విచక్ర వాహనదారుడిని ఢీకొంది. ఇదే సమయంలో అదుపు తప్పి రహదారి మధ్యలో ఉన్న విభాగిని మీద నుంచి గాలిలోకి తేలి రోడ్డున మధ్యన ఉన్న విభాగినికి మరో వైపు వస్తున్న వాహనాన్ని ఎదురుగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఇరు వాహనాల్లోని వారు గాయపడ్డారు. ప్రమాదం అనంతరం ఐ 20 కారులో ఉన్న వ్యక్తులు అక్కడి నుంచి వాహనాన్ని వదిలి వెళ్లిపోయారు. వింగర్ వాహనం నడుపుతున్న గణేష్కు, అతని వెనుక కూర్చొన్న ఆరిఫ్కు, మిగిలిన ఉద్యోగులకు స్వల గాయలయ్యాయి. ఇదిలా ఉండగా కారు గాల్లోకి తేలి అవతలి వైపునకు వెళ్లే క్రమంలో మధ్యలో ఉన్న చెట్టు విరిగింది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వింగర్ వాహనంలో ఉండి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రెండు వాహనాలను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన ఐ 20 కారులోని వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇందుకోసం సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఐ 20 కారులో ఉన్న వారు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే కారును వదిలి పారిపోయినట్లు భావిస్తున్నారు







