UPDATED 4th NOVEMBER 2022 FRIDAY 6:50 PM
Nandigama: నందిగామలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్షోలో రాళ్ల దాడి చేశారు. చంద్రబాబు కాన్వాయ్ (Chandrababu Convoy)పై ఓ దుండగుడు రాయి విసిరారు. ఈ దాడిలో చంద్రబాబు, చీఫ్ సెక్యూరిటీ అధికారి (Chief Security Officer) మధు గాయపడ్డారు. రాయి విసిరిన సమయంలో విద్యుత్ సరఫరా నిలివేశారు. పోలీసుల భద్రతా వైఫల్యంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు చంద్రబాబు రోడ్షోలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రోడ్షో తొందరగా ముగించాలంటూ టీడీపీ నేతలపై పోలీసుల ఒత్తిడి తెచ్చారు. రోడ్షోకు భారీగా జనం తరలిరావడంతో అదనపు పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. చంద్రబాబు వాహనానికి ముందు, వెనుకా పెద్దఎత్తున రోప్ పార్టీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు వాహనం చుట్టూ అదనపు భద్రతా బలగాలు ఏర్పాటు చేశారు.
నందిగామలో చంద్రబాబుకు ఘన స్వాగతం
నందిగామలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. నందిగామ రైతుపేట నుంచి చంద్రబాబు రోడ్షో నిర్వహించారు. రోడ్షోకు స్థానికులు, టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. చంద్రబాబుకు అడుగడుగునా పూలవర్షంతో స్వాగతం పలికారు.







