Updated 25 January 2022 Tuesday 09:30 PM
విజయవాడ (రెడ్ బీ న్యూస్): ప్రయాణికుల ఆదరణ పొందేందుకు కృష్ణా జిల్లా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. కృష్ణాజిల్లా - హైదరాబాద్ మధ్య ఛార్జీలు తగ్గించాలని నిర్ణయించారు. దీంతో కృష్ణాజిల్లాకు చెందిన ఇంద్ర, అమరావతి, గరుడ, నైట్ రైడర్, వెన్నెల స్లీపర్ బస్సుల్లో 20 శాతం వరకు ఛార్జీలు తగ్గిస్తామని ఆర్ఎం యేసు దానం వెల్లడించారు. కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి ఆదివారం, అలాగే హైదరాబాద్ నుంచి కృష్ణా జిల్లాకు వచ్చే వారికి శుక్రవారం రోజున ఈ రాయితీ వర్తించదు.
విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, ఆటోనగర్ డిపోల బస్సుల్లో ప్రయాణించేవారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. ఫిబ్రవరి 28 వరకు మాత్రమే ఈ రాయితీలు అందుబాటులో ఉంటాయని, ఆర్ఎం యేసు దానం తెలిపారు. గుడివాడ నుండి బీహెచ్ ఈల్ కు ఇంద్ర బస్సులో ఛార్జీ రూ. 610 నుంచి రూ.555 కు తగ్గనుంది. విజయవాడ నుంచి హైదరాబాదు అమరావతి బస్సు ఛార్జీ ప్రస్తుతం రూ. 650 కాగా రాయితీ వర్తిస్తే రూ.535కి తగ్గనుంది. గరుడ బస్సుకు ప్రస్తుతం రూ. 620 వసూలు చేస్తుండగా.. రాయితో రూ. 495కు తగ్గను. వెన్నెల స్లీపర్ బస్సుకు రూ. 130 వసూలు చేస్తుండగా దాని ధర రూ.590కి తగ్గనుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యేసు దానం కోరారు.







