Updated 13th March 2023 Monday 7:55 pm
Perni Nani : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. ప్రజలకు మేలు చేసే పని ఒక్కటైనా పవన్ చేశారా అని నిలదీశారు. చంద్రబాబు బాగుపడాలనేదే పవన్ అంతిమ లక్ష్యం అన్నారు. కాపు, బలిజలు వేరు అని పవన్ కు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. పచ్చి దగా మాటలు ఎవరి కోసం మాట్లాడుతున్నావని అడిగారు. ప్రజల కోసం అన్నీ త్యాగాలు చేశానన్న పవన్ కు మళ్లీ సినిమాలెందుకని ప్రశ్నించారు.
రాజకీయాల అవసరాల కోసం పవన్ బరితెగించి అబద్ధాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజా నాయకుడికి ఏ కులం అయితే ఏంటని ప్రశ్నించారు. ప్రజలు నమ్మితే ఓటేస్తారు.. కులం చూసి కాదన్నారు. చంద్రబాబు, పవన్ బండారం ఎన్నాళ్లు దాస్తారని ప్రశ్నించారు. చంద్రబాబుతో పవన్ కు లోపాయికారి ఒప్పందం లేదా అని నిలదీశారు.
జగన్ పై పవన్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో పోటీ పడి పవన్ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని వెల్లడించారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకోసం మారాలి? ఎవరి కోసం మారాలి? అని ప్రశ్నించారు. ఏడాది తర్వాత పవన్ బయటకు వచ్చారని తెలిపారు.







