అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణ టాటా స్పష్టం చేశారు. పోలీసు అధికారులు ఆయనతో మాట్లాడారని, భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు సీపీ తెలిపారు. రాధా ఇచ్చిన సమాచారం తీసుకున్నామని, ఈ ఘటనపై ఎలాంటి అవాస్తవాలు ప్రసారం చేయొద్దని కోరారు. అన్ని కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతోందన్న సీపీ.. ఎలాంటి నేరం జరగనప్పుడు, క్రిమినల్ యాక్టివిటీ లేనప్పుడు జీరో ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తామని ప్రశ్నించారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, పోలీసులతో పాటు రాష్ట్ర స్థాయి ఏజెన్సీలు కూడా దర్యాప్తు చేస్తున్నాయని అన్నారు... ప్రస్తుతం విజయవాడలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని సీపీ వివరించారు.







