Updated 24th December 2022 Saturday 2:10 pm
Srivari Break Darshans Canceled : తిరుమలలో ఈ నెల 27న శ్రీవారి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సోమవారం ఉదయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 26వ తేదీన సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని టీటీడీ అధికారులు కోరారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని చెప్పారు. కాగా, నిన్న శ్రీవారిని 62,055 మంది భక్తులు దర్శించుకున్నారు.23,044 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీకి రూ.3.99 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ, వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లను శనివారం టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు 2.20 లక్షల టికెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో టికెట్లను కొనుగోలు చేయాలని భక్తులకు టీటీడీ సూచించింది. జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న వైకుంఠ ద్వారా దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల ఆన్ లైన్ కోటాను టీటీడీ విడుదల చేసింది. ఈ విషయాన్ని గమనించి భక్తులు దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.







