అమరావతి (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై ముఖ్యమంత్రి జగన్ సుదీర్ఘంగా చర్చించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉద్యోగులకు పీఆర్సీ, సీపీఎస్ రద్దు సహా మిగిలిన డిమాండ్ల పరిష్కారంపై సమగ్రంగా చర్చించారు. ఉద్యోగులకు ఎంతమేర ఫిట్మెంట్ ఇవ్వాలనే అంశంపై సమాలోచనలు చేశారు. 14.29 శాతం పైన ఎంతశాతం ఫిట్మెంట్ ఇస్తే బడ్జెట్పై ఎంత భారం పడుతుందనే అంశంపై సీఎంకు ఆర్థికశాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు జరిపే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాలతో జరిపే చర్చల్లో ఫిట్మెంట్ ఖరారు చేయనున్నారు. రేపు చర్చలు జరిగే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉండాలని ఉద్యోగ సంఘాల నేతలకు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు సమాచారమిచ్చాయి.







