పెద్దాపురం: 4 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): ఈనెల 8వ తేదీ నుంచి దేవాలయాల్లో భక్తుల దర్శనానికి ప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో దర్శనానికి వచ్చే భక్తులు తమ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ బీవీఎస్ దుర్గాప్రసాద్ అన్నారు. మండలంలోని తిరుపతి శృంగార వల్లభ స్వామి దేవస్థానాన్ని ఆయన గురువారం సందర్శించారు.
ఈ సందర్భంగా డీసీ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుంచి గుర్తించిన దేవాలయాల్లో భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుందని, భౌతిక దూరం పాటిస్తూ భక్తులు మాస్కులు ధరించి
దైవ దర్శనం చేసుకోవాలన్నారు. కొంతకాలం పాటు తాత్కాలికంగా అంతరాలయ దర్శనం, తీర్థం, శఠారి నిలిపివేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి
కాట్నం జగన్మోహన శ్రీనివాస్ మాట్లాడుతూ 8,9,10 మొదటి మూడు రోజులు తిరుపతి,
చదలాడ గ్రామాలకు చెందిన భక్తులకు మాత్రమే స్వామి వారి దర్శన భాగ్యం కల్పించి ట్రయల్
రన్ గా ఆలయ ప్రవేశం ఉంటుదన్నారు. ఆయా గ్రామాల భక్తులు సైతం ఆధార్ నెంబరుతో పరిమిత సంఖ్యలో మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతించడం జరుగుతుందని, భక్తులు సహకరించాలని ఆయన కోరారు. అనంతరం డీసీ దుర్గాప్రసాద్ ఆలయ సిబ్బందికి
పలు సూచనలు, సలహాలిచ్చారు. ఆయన వెంట కాకినాడ డివిజన్ ఇనస్పెక్టర్ విఎస్ఎన్ఎన్ రెడ్డి, ఆలయ అర్చకులు పెద్దింటి వెంకట గోపాల సీతారామాచార్యులు, సిబ్బంది ఉన్నారు.







