UPDATED 10th JULY 2022 SUNDAY 11:40 AM
Vijayawada: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. రేణిగుంట తారకరామా నగర్లో ఒక కుటుంబానికి 2004లో వైఎస్సార్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందని, ఇప్పుడు వైసీపీ ఎంపీటీసీ ఒకరు ఆ ఇంటిని లాక్కునేందుకు దౌర్జన్యం చేశారని అన్నారు.
మహిళలను చెప్పలేని విధంగా తిట్టారని చెప్పారు. ఇలా తిడుతోన్న వారి ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని ఆయన ప్రశ్నించారు. ఇరవై ఏళ్ళుగా ఉంటున్న వాళ్లని రోడ్డు మీద పడేశారని, యథా రాజా.. తథా ప్రజా అన్న విధంగా వైసీపీ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఎన్నికల ముందు చేతులు పట్టుకుని ముద్దులు పెట్టింది ఇందుకేనా? అని సీఎం జగన్ను ఉద్దేశించి అన్నారు. ఇటువంటి ఘటనల వల్లే తీవ్రవాద ఉద్యమాలు పుట్టుకొస్తాయని చెప్పారు.
అధికార మదంతో ఇలా చేస్తారని తాను గతంలోనే చెప్పానని అన్నారు. పేదల కష్టాలు, కన్నీళ్ళు చూసే తాను గతంలో కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టానని తెలిపారు. నాయకుడి తాలూకా లక్షణాలు ప్రతి గ్రామానికి వెళ్తాయని అన్నారు. అన్ని స్థాయుల్లో అధికారంతో దోచుకుంటారా అని నిలదీశారు. ఇటువంటి సమస్యలు చూసే తాను జనవాణి పెట్టానని చెప్పారు. హోం మంత్రి, అధికారులు స్పందించి తారకరామా నగర్లోని కుటుంబం ఎదుర్కొంటోన్న సమస్యను పరిష్కరించాలని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే జనసేన రోడ్ల మీదకు వచ్చి పోరాడుతుందని హెచ్చరించారు.
అన్యాయం ఎప్పుడు జరిగినా ప్రజలు బయటకి వచ్చి నిలదీయాలని ఆయన అన్నారు. తనను కూడా చాలా రకాలుగా బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు. తాను భయపడబోనని, పేదల జోలికి వస్తే తోలు తీస్తామని హెచ్చరించారు. వైసీపీ నాయకులు పేదల జోలికి వస్తే తానే స్వయంగా అక్కడకి వెళతానని చెప్పారు.







