ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: విద్యుత్ వివాదాలను రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యుత్ బకాయిల చెల్లింపు అంశంపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఈ వివాదాన్ని రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. తెలంగాణ రూ.6,111 కోట్లు విద్యుత్ బకాయిలు ఏపీకి చెల్లించాలని ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వాకి లేఖ రాశారు. విద్యుత్పై రెండు రాష్ట్రాల మధ్య ఉన్నది ద్వైపాక్షిన ఒప్పందం. రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య ఈ ఒప్పందం జరిగింది. తెలంగాణ బకాయిపడిన సొమ్ములో అసలుపై ఎలాంటి వివాదం లేదు. అసలుపై విధించిన పడ్డీ విషయంలోనే వివాదం నెలకొంది. తెలంగాణ, ఏపీ సామరస్యంగా రాజీ చేసుకోవాలి’’ అని కేంద్ర మంత్రి వివరించారు.
ప్రత్యేక హోదా బదులుగా ప్యాకేజీ..
‘‘ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం. ప్రత్యేక హోదా కావాలని ఏపీ సీఎం జగన్ ఇటీవల కోరారు. నీతి ఆయోగ్తో భేటీలో సీఎం జగన్ ఈ ప్రతిపాదన చేశారు. గతంలో ఏపీ కోరినందునే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం. విభజన చట్టం హామీలు నెరవేర్చే బాధ్యత మాది. ఏపీకి సాయం అందించేందుకు కట్టుబడి ఉన్నాం. ఏపీకి 2015-19 మధ్య ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాం. ఏపీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులకు రుణం సమకూర్చాం. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల రుణంపై వడ్డీ కడుతున్నాం. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.19,846 కోట్లు, రెవెన్యూ లోటు గ్రాంటు కింద రూ.22,112 కోట్లు ఏపీకి అందించాం. 2020-21లో ఏపీకి రూ.5,897 కోట్లు ఇచ్చాం’’ అని ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి వివరించారు.







