Andhra Pradesh: ఏపీలో ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

Updated 6th March 2023 Monday 3:20 pm

Andhra Pradesh: ఏపీ శాసన మండలిలో మార్చి చివరి వారంలో ఖాళీ కానున్న పలు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. శాసన మండలి సభ్యుడు చల్లా భగీరధ్ రెడ్డి పదవీ కాలం గత ఏడాది నవంబరు 2వ తేదీతో ముగిసింది. ఈ నెల 29తో నారా లోకేశ్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద రావు, వరాహ వెంకట సూర్యనారాయణ రాజు పెనుమత్స, గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం ముగియనుంది.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖాళీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 27వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ను రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి ఇవాళ జారీ చేశారు. అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయాలనుకునే వారు స్వయంగా లేదా వారి ప్రతిపాదకుడి ద్వారా గాని వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభా భవనంలో నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు.

రిటర్నింగ్ అధికారి లేదా సహాయ రిటర్నింగ్ అధికారి లేదా శాసన మండలి ఉప కార్యదర్శికి నామినేషన్లను సమర్పించవచ్చని చెప్పారు. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవు దినాలు మినహా మిగతా పనిదినాల్లో ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వివరించారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 11 గంటలకు అసెంబ్లీ భవనంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుందని అన్నారు. ఈ నెల 16వ తేది మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని గుర్తు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ ఉంటే ఈ నెల 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ భవనంలో పోలింగ్ జరుగుతుందని చెప్పారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us