చండీగఢ్ (రెడ్ బీ న్యూస్) 23 డిసెంబర్ 2021: పంజాబ్ రాష్ట్రం లుథియానాలోని జిల్లా, సెషన్స్ కోర్టు సముదాయంలో గురువారం పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కోర్టు కాంప్లెక్స్ రెండో అంతస్తులోని మూత్రశాలల్లో ఈ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున శబ్దం, పొగలు రావడంతో.. స్థానికులంతా కోర్టు బయట గుమిగూడారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గురువారం న్యాయవాదులు సమ్మెలో ఉండటంతో.. పేలుడు జరిగిన సమయంలో కోర్టు కాంప్లెక్స్లో కొద్దిమంది మాత్రమే ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల దిల్లీలోని రోహిణి కోర్టులోనూ స్వల్ప పేలుడు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓ న్యాయవాదిని లక్ష్యంగా చేసుకుని డీఆర్డీవో శాస్త్రవేత్త ఒకరు టిఫిన్ బాక్స్ బాంబ్ను అమర్చినట్లు అనంతరం పోలీసుల విచారణలో వెల్లడయింది. ఈ వ్యవహారంలో సదరు శాస్త్రవేత్తను అరెస్ట్ చేశారు.







