UPDATED 19 APRIL 2022 TUESDAY 11:00 AM
YS Jagan Vizag Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపట్లో విశాఖపట్నం చేరుకోనున్నారు. ఈరోజు ఉదయం గం.11:50 లకు ఆయన రుషికొండలోని పెమ వెల్ నెస్ రిసార్టుకు వెళతారు. అక్కడ హరియాణా సీఎం మనోహర్లాల్ ఖట్టర్తో సమావేశం అవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ గత కొద్దిరోజులుగా విశాఖలోనే ఉంటూ పెమ వెల్నెస్ సెంటర్లో నేచురోపతి చికిత్స తీసుకుంటున్నారు. రేపటి వరకు ఆయన విశాఖలోనే ఉంటారు. వీరిద్దరి కలయిక ప్రస్తుతం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. అసలు వీరిద్దరూ ఎందుకు కలుస్తున్నారు. ఏ విషయాలపై వీరు చర్చిస్తారు. ఎందుకు ఈ భేటీ జరుగుతోంది… అనేది రాజకీయవర్గాలలో ఆసక్తిగా మారింది. హరియాణా సీఎం తో భేటీ అనంతరం సీఎం జగన్ మధ్యాహ్నం గం.1-25కి తిరిగి విజయవాడ బయలు దేరతారు. మధ్యాహ్నం గం.2-30కితాడేపల్లి చేరుకుంటారు.
ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ప్రస్తుతం విశాఖపట్నంలోనే ఉన్నారు. మర్యాదపూర్వకంగా కూడా ఆయన్ను సీఎం జగన్ కలవటంలేదు. జగన్ టూర్ షెడ్యూల్ లో ఆయన ప్రోగ్రాంలేదు. కేవలం ఖట్టర్ ను కలవటానికి మాత్రమే సీఎం జగన్ విశాఖ వస్తున్నారు.సాధారణంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రానికి వస్తే వారు వెళ్లి రాష్ట్ర సీఎం ను కలవటం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇప్పుడు సీఎం జగన్ వేరే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవటానికి ఎందుకు వస్తున్నారనేది అంతు చిక్కని ప్రశ్నలా మారింది. ఏది ఏమైనా వీరి కలయిక ఫలితం కోసం కొన్నాళ్లు వేచి ఉండక తప్పదు.







