UPDATED 7th APRIL 2022 THURSDAY 06:50 PM
Jagananna Vasathi Deevena : ఏపీలోని విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం (ఏప్రిల్ 8) జగనన్న వసతి దీవెన కింద తదుపరి విడత నిధులను అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.
జగనన్న వసతి దీవెన పథకం కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ పీజీ విద్యార్థులకు వసతి, భోజన, రవాణా ఖర్చుల కింద 20వేల రూపాయలు ఇస్తోంది ఏపీ సర్కార్. శుక్రవారం నంద్యాలలో పర్యటించనున్న సీఎం జగన్.. వసతి దీవెన పథకం కింద నిధులు విడుదల చేయనున్నారు.
సంక్షేమ పథకాల క్యాలెండర్ను ముందుగానే ప్రకటించి కరోనా కల్లోలంలోనూ తప్పకుండా సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విద్యార్థుల బంగారు భవితే లక్ష్యంగా వసతి, భోజన ఖర్చుల కోసం తల్లుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నారు. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి చదువు ఒక్కటే అని విశ్వసించే సీఎం జగన్.. జగనన్న వసతి దీవెన పథకం కింద అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేల చొప్పున, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన, రవాణ ఖర్చులను చెల్లించేందుకు జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. కుటుంబంలో ఎంతమంది చదువుకుంటున్న పిల్లలు ఉంటే అంతమందికీ వారి తల్లుల ఖాతాకు ఈ సొమ్ము జమ చేస్తోంది ప్రభుత్వం. దేశంలో ఎక్కడా ఇటువంటి పథకం లేదని ప్రభుత్వం చెబుతోంది.







