ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 22 అక్టోబర్ 2021: కోనసీమ తిరుమల వాడపల్లిలో ఏడు వారాల వెంకన్నస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆలయ పరిసరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. దేవదేవుడు దేవేరులతో ఈ నెల 25 నుంచి తొమ్మిది రోజుల పాటు వివిధ వాహనాల్లో విహరిస్తూ భక్తులకు స్వామి కనువిందు చేయనున్నాడు. ఈ సమయంలో శ్రీనివాసుడిని దర్శించుకుని జన్మ ధన్యం చేసుకోవాలనే తలంపుతో భక్తకోటి వాడపల్లి తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో దేవస్థానం వాడపల్లి క్షేత్రాన్ని విద్యుద్దీపాలు, రంగుల పూల తోరణాలు, అరటి, మామిడి ఆకులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సోమవారం నుంచి నవంబరు ఒకటి వరకు శేష, హంస, హనుమ, సింహ, గరుడ, సూర్య, చంద్రప్రభ, గజ, అశ్వ వాహనాలపై శ్రీవారు ఊరేగుతూ భక్త జనులను కటాక్షిస్తారు. చివరి రోజు నవంబరు 2 ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం, రాత్రి చూర్ణోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ రుద్రరాజు రమేష్రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. ఈ మేరకు తగు ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు.







